ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాజెక్ట్ చుట్టూ మరోసారి వివాదాల మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్ల మధ్య ఈ ప్రాజెక్ట్ ఒక “ఫుట్బాల్ మ్యాచ్”లా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భూములు ఇచ్చిన రైతులు మాత్రం కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయారన్న అభిప్రాయం బలపడుతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, “ఇది దేవుడే కాపాడాలి” అన్న వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వివాదాలకు మరింత ఊతమిచ్చిన అంశం అమరావతి గ్రోత్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్) ఎండీగా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్వీఆర్ శ్రీనివాస్ రాజీనామా. కేవలం నాలుగు నెలల్లోనే ఆయన తన పదవికి గుడ్బై చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఏర్పాటైన ఏజీఐసీఎల్ సంస్థకు అమరావతి నిర్మాణంలో కీలక బాధ్యతలు అప్పగించారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, ఐకానిక్ వంతెన, రివర్ఫ్రంట్ అభివృద్ధి, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి కీలక ప్రాజెక్టులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఈ సంస్థకు అప్పగించినట్లు ప్రకటించారు. అదే సమయంలో (సీఆర్డీఏ) అధికారాలను కూడా ఈ సంస్థకు బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
తర్వాత జరిగిన అధికారుల మార్పులు ఈ వ్యవహారాన్ని మరింత క్లిష్టం చేశాయి. సీఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు స్థానంలో విజయరామరాజు నియమితులయ్యాక, ఏజీఐసీఎల్ పాత్రను పక్కనపెట్టినట్లుగా వ్యవహరించారన్న విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా “మీరు అవసరం లేదు, నేను చూసుకుంటాను” అన్న వ్యాఖ్యలు శ్రీనివాస్కు అవమానంగా మారాయా అన్న అనుమానం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనితో ఆయన రాజీనామా చేశారన్న ప్రచారం జరుగుతోంది.
శ్రీనివాస్కు ఉన్న అనుభవం కూడా ఈ వ్యవహారాన్ని మరింత ప్రాధాన్యంగా మారుస్తోంది. ఆయన అటల్ సేతు వంటి భారీ మౌలిక వసతి ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. అలాగే జేఎన్పీటీ పోర్టు అభివృద్ధిలో కూడా ఆయన సేవలు విశేషంగా నిలిచాయి. కేంద్ర-రాష్ట్ర సమన్వయం, అంతర్జాతీయ నిధుల వినియోగం, మౌలిక వసతుల అభివృద్ధిలో ఆయన అనుభవం విశేషమైనదిగా గుర్తింపు పొందింది.
ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్న సీనియర్ అధికారిని ప్రత్యేకంగా పిలిపించి, చివరకు “మీరు అవసరం లేదు… నేను చూసుకుంటాను” అని చెప్పడం అవమానకరం కాదా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేసే అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేక నొచ్చుకుని వెళ్లిపోవడం కొత్త విషయం కాదని కూడా వారు గుర్తుచేస్తున్నారు.
2014–2019 మధ్య జరిగిన ముఖ్య ఘటనలు:
మెట్రో ప్రాజెక్ట్ పితామహుడు, రాష్ట్ర సలహాదారుగా ఉన్న శ్రీధరన్ గారు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆరు నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించడం, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకు ఆయన నేతృత్వంలోని డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్)పై అనవసర ఆరోపణలు చేయడం వంటి కారణాలతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఐ.వై.ఆర్. కృష్ణారావు గారు సీఎంఓలో పారదర్శకత, బాధ్యతల లోపం కారణంగా మానసిక ఒత్తిడితో రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ తొలి ఐఏఎస్ అధికారి గిరిధర్ అర్మాణి గారు ఒక సంవత్సరం లోపే కేంద్ర డిప్యూటేషన్కు వెళ్లిపోయారు.
ఫైనాన్స్ అడ్వైజర్ సి.ఎస్. రావు గారు, ముఖ్యమంత్రి ఉండమని కోరినా, రాజీనామా చేసి వెళ్లిపోయారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి పి.కే. అగర్వాల్ గారు ‘నీరు-చెట్టు’ కార్యక్రమానికి అడ్వైజర్గా ఉన్నారు. పాలనపై అసంతృప్తితో రాజీనామా చేసి, అది స్వీకరించకపోవడంతో కార్యాలయానికి తాళం వేసి “ఈ ఉద్యోగం వద్దు, జీతం వద్దు” అంటూ వెళ్లిపోయారు.
అమరావతి నిర్మాణానికి తీసుకొచ్చిన జపాన్ “మాకి” సంస్థ, ఆంధ్రప్రదేశ్ పాలనపై అసంతృప్తితో ప్రాజెక్ట్ను వదిలి వెళ్లిపోయింది.
అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్గా ఉన్న ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ రవిచంద్ర గారు, అక్కడ జరుగుతున్న లోపాలను తట్టుకోలేక తనను ఆ పదవి నుంచి తప్పించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరారు.
ఇంకా గతంలో బాబు గారి 9 ఏళ్ల పాలనలో (1995-2004) చూస్తే:
సీనియర్ డీజీపీ స్థాయిలో రిటైర్ అయిన వి.పి.బి. నాయర్ గారు, పోలీసులు రాజకీయ అవసరాలకు ఉపయోగపడుతున్నారని విమర్శించారు.
అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసిన సాంబశివరావు గారు ఢిల్లీకి వెళ్లిపోయారు.
ప్రిన్సిపల్ కార్యదర్శి స్థాయిలో ఉన్న బైడే గారు, ఆయన భార్య షీలా బైడే గారు కూడా పాలనపై అసంతృప్తితో ఢిల్లీకి వెళ్లిపోయారు.
ఉత్తమ అధికారిగా పేరు పొందిన రత్న కిషోర్ గారు, ఢిల్లీ బదిలీ సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వ సేవను వదిలి ఫెర్టిలైజర్ కంపెనీకి మారిపోయారు.






