టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)ను దూషించారనే ఆరోపణ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు తెరపైకి రావడంతో జైలు అధికారులు స్పష్టత ఇచ్చారు.
అంబటి రాంబాబుకు నిద్రలో శ్వాస సంబంధిత సమస్యలు (Respiratory Issues) ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్టు జైలు అధికారులు తెలిపారు. ముఖ్యంగా నిద్ర సమయంలో శ్వాస తీసుకునే స్థాయి ఒక్కోసారి తగ్గిపోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమస్యను నివారించేందుకు వైద్యుల సూచనల మేరకు ఆయన స్లీప్ అప్నియా పరికరాన్ని ఉపయోగిస్తున్నారని వెల్లడించారు.
ఈ శ్వాస సమస్య ఎప్పుడు తలెత్తుతుందో ముందుగా అంచనా వేయలేని పరిస్థితి ఉండటంతో, నిద్రకు వెళ్లే ముందు నుంచే స్లీప్ అప్నియా పరికరాన్ని అమర్చుకుంటారని వైద్యులు సూచించినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకే ఈ పరికరాన్ని అంబటి రాంబాబుకు అందించినట్టు జైలు అధికారులు స్పష్టం చేశారు.
అయితే, ప్రస్తుతం అంబటి రాంబాబు జైల్లో పూర్తిస్థాయి ఆరోగ్యంతోనే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని అధికారులు తెలిపారు.






