ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రి మండలి (Cabinet) ఈరోజు (ఫిబ్రవరి 24) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
సీఆర్డీయే (CRDA) ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. గత ప్రభుత్వ కాలంలో అమరావతి (Amaravati) రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఏర్పాటు చేసిన R-5 జోన్ను రద్దు చేయాలనే ప్రతిపాదన ప్రధాన అజెండాగా ఉంది. దాదాపు 1,402.58 ఎకరాల భూమిని తిరిగి సీఆర్డీయేకి అప్పగించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పట్లో రూపొందించిన లేఔట్లు, భూ పంపిణీ ప్రక్రియను కూడా రద్దు చేసే అంశంపై చర్చ జరగనుంది.
ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారు 50 వేల కుటుంబాలకు మంజూరైన స్థలాల అంశం కూడా చర్చకు రానుంది. ఈ R-5 జోన్ వల్ల అమరావతి మాస్టర్ ప్లాన్కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు.
అదేవిధంగా పలు సంస్థలకు భూ కేటాయింపులు, ఎస్ఐపీబీ ప్రతిపాదనల ఆమోదం, తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశముంది. తిరుమల లడ్డూ, కల్తీ పాల వ్యవహారాలపై కూడా మంత్రివర్గం దృష్టి సారించనుంది.






