ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించిన మావిగన్ కారిడార్ ఆలోచన చుట్టూ తీవ్ర చర్చ కొనసాగుతోంది. లక్షల కోట్ల వ్యయం అవసరమయ్యే అమరావతి నిర్మాణానికి బదులుగా, మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాలను అనుసంధానిస్తూ తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో పూర్తి స్థాయి రాజధాని అభివృద్ధి సాధ్యమని జగన్ సూచించారు. అయితే ఈ ప్రతిపాదనపై లోతైన విశ్లేషణ చేయకుండా అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం. మంత్రి కొలుసు పార్థసారథి, అలాగే జయప్రకాశ్ నారాయణ వంటి నేతలు ఈ ఆలోచనను “తుగ్లక్ చర్య”గా అభివర్ణించడం రాజకీయ వాదోపవాదాలకు దారితీసింది.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజల్లో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి — నిజంగా తుగ్లక్ చర్య ఎవరికి సరిపోతుంది? జగన్ ప్రతిపాదనకా, లేక చంద్రబాబు అమరావతి ఆలోచనకా? ఈ చర్చను అర్థం చేసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాల్సి వస్తుంది. సుల్తాన్ మహ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చిన నిర్ణయం వల్లే అతను విమర్శలకు గురయ్యాడు. రాజ్యానికి మధ్యలో రాజధాని ఉండాలనే ఆలోచనతో తీసుకున్న ఆ నిర్ణయం ప్రజలకు ఇబ్బందులు కలిగించి, ఆర్థికంగా కూడా రాజ్యాన్ని దెబ్బతీసింది.
ఇప్పటి పరిస్థితుల్లో కూడా రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని, అన్ని కార్యకలాపాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావాలని భావించడం చంద్రబాబు నాయుడు ఆలోచనగా విమర్శకులు పేర్కొంటున్నారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని పేరుతో భారీగా అప్పులు తెచ్చి, మౌళిక సదుపాయాల కంటే ముందే భారీ నిర్మాణాలపై దృష్టి పెట్టడం ఆర్థిక భారాన్ని పెంచుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది.
తుగ్లక్ తన రాజధాని తన రాజ్యానికి మధ్యలో ఉండాలని తీసుకున్న నిర్ణయంతోనే ఢిల్లీని వదిలి దౌలతాబాద్కు మకాం మార్చినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే నేడు కూడా రాష్ట్ర రాజధాని రాష్ట్రానికి మధ్యలోనే ఉండాలని, అన్నీ ఒకే చోట కేంద్రీకృతం కావాలని చంద్రబాబు గారి వాదనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సుల్తాన్ తుగ్లక్ రాజధాని రాజ్యానికి మధ్యలోనే ఉండాలనే వాదనతో చంద్రబాబు గారి వాదనకు పోలిక కనిపిస్తుంది.
అలాగే రాజధాని మధ్యలో ఉండటంతో పాటు సుందరమైన నగరంగా ఉండాలని తుగ్లక్ ఆలోచించి, స్తోమతకు మించి దానిపై డబ్బు ఖర్చు చేసి రాజ్యం దివాలా తీసే పరిస్థితి తెచ్చుకున్నాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఇదే విధంగా చంద్రబాబు గారు కూడా గ్రీన్ఫీల్డ్ రాజధాని పేరుతో రాష్ట్ర ఖజానా సామర్థ్యాన్ని మించి అప్పులు తెచ్చి, భారీ నిర్మాణాల పేరుతో ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని పలువురి నుంచి వినిపిస్తున్న మాట. ఇది కూడా సుల్తాన్ తుగ్లక్ నిర్ణయంతో చంద్రబాబు ఆలోచన పోలి ఉందని చెబుతున్నారు.
ఇక తుగ్లక్ కాలంలో ప్రజలను రాజధాని మార్పు కోసం బలవంతంగా తరలించడం, వారి ఆస్తులను కొనుగోలు చేయడం వల్ల రాజ్య ఖజానాపై భారీ భారం పడింది. ఇదే తరహాలో అమరావతి ప్రాంతంలో భూముల సేకరణ, రైతులకు కౌలు చెల్లింపులు, మౌళిక సదుపాయాల కోసం భారీ వ్యయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ పోలికల నేపథ్యంలో తుగ్లక్ నిర్ణయాలకు దగ్గరగా ఉన్నది ఎవరి ఆలోచన అన్నది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రతిపాదనను విమర్శించే క్రమంలో తుగ్లక్ పేరును ప్రస్తావించడం ద్వారా అసలు చరిత్రపై మళ్లీ దృష్టి పడింది. ఫలితంగా విమర్శల కంటే లోతైన విశ్లేషణ అవసరమనే అభిప్రాయం బలపడుతోంది.
మొత్తానికి, రాజధాని అంశం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, చరిత్ర, ఆర్థిక పరిస్థితులు, ప్రజల అవసరాలు కలిసి పరిశీలించాల్సిన కీలక అంశంగా మారింది. ఈ వివాదం ఇంకా ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి.






