గత వైఎస్ జగన్ ప్రభుత్వ (YS Jagan Government) హయాంలో కోకో గింజల (Cocoa Beans) కిలో ధర రూ.1,050 వరకు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు కంపెనీలు ఏకపక్షంగా ధరలను తగ్గించడం తీవ్ర అన్యాయమని ఏపీ కోకో రైతుల సంఘం (AP Cocoa Farmers Association) రాష్ట్ర సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ను సాకుగా చూపుతూ రైతులను (Farmers) మోసం చేస్తున్న కంపెనీల తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన సంఘం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కోకో ధరల పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేసింది.
ఈ నెల 9న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న సమావేశానికి ముందే కంపెనీలు కోకో గింజల ధరలను రూ.400 నుంచి రూ.380, అంతకంటే తక్కువగా తగ్గించడం వెనుక కుట్ర ఉందని రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్ ధరలు అధికంగా ఉన్నప్పటికీ రైతులకు తక్కువ ధరలే చెల్లించారని గుర్తు చేస్తూ, ఇదే పరిస్థితి కొనసాగితే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఫార్ములా ఆధారిత ధరను నిర్ణయించి, రైతులకు న్యాయం చేయకపోతే 9వ తేదీ తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.






