ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు (Garikapati Narasimha Rao) వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి (Kamalananda Bharati) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పేరుమార్పు (Name change), “తెలుగునాడు” (Telugu Nadu) అనే ప్రతిపాదనలపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. కేరళ పేరును కేరళంగా మార్చినట్టే.. ఏపీ పేరును తెలుగునాడు అని మార్చాలని గరికపాటి వ్యాఖ్యానించారు. దీనిపై కమలానంద భారతి ఫైరయ్యారు.
“ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా?” అంటూ ప్రశ్నించారు. అడిగేవాళ్లు లేరని అధిక ప్రసంగాలు చేయడం సరికాదని ఆయన విమర్శించారు. రామాయణ కాలం నుంచే “ఆంధ్రా” (Andhra) అనే పేరు ఉందని, చరిత్రను విస్మరించి వింత పోకడలు, వింత ఆలోచనలు ముందుకు తెచ్చే ప్రయత్నాలు మంచివి కావని కమలానంద భారతి అన్నారు. పేరు మార్చితే ఎలాంటి సెంటిమెంట్ రాదని, ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దని సూచించారు. “మేం ఆంధ్రప్రదేశ్ ప్రజలుగానే ఉంటాం” అని స్పష్టం చేశారు.
గరికపాటి తెలంగాణలో స్థిరపడ్డారని, అక్కడ ఉండి ఆంధ్రప్రదేశ్ విషయాల్లో సలహాలు ఇవ్వడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. “మా ప్రాంతం, మా బతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు” అని పేర్కొన్నారు. బయటివారు వచ్చి అనవసర వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. అలాగే ఎన్టీఆర్ “ఆంధ్రుల ఆత్మగౌరవం” నినాదాన్ని ఎత్తుకున్నప్పటికీ పార్టీకి “తెలుగుదేశం” అనే పేరు పెట్టారని గుర్తుచేశారు. చరిత్ర, సంస్కృతి, ప్రాంతీయ గౌరవం అన్నీ పరస్పర అనుబంధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి చర్చలు ప్రజల్లో అనవసర విభేదాలకు దారి తీస్తాయని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమలానంద భారతి సూచించారు. రాష్ట్ర పేరు, గుర్తింపు వంటి అంశాలు ప్రజల భావోద్వేగాలకు సంబంధించినవని, వాటిపై రాజకీయ లాభాల కోసం వ్యాఖ్యలు చేయడం తగదని స్పష్టం చేశారు.






