ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో (Ghaziabad) సంచలన ఘటన చోటుచేసుకుంది. క్షణికావేశంతో ఓ సెక్యూరిటీ గార్డు (Security Guard) తన బ్యాంక్ మేనేజర్ను కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపింది. సెలవు తీసుకున్నందుకు జీతం కట్ (Salary Cut) చేశారనే ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
సెలవు వివాదం నుంచి హత్య వరకు
బలరామ్ నగర్ కాలనీలో ఉన్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ శాఖలో అభిషేక్ కుమార్ (Abhishek Kumar) మేనేజర్గా పనిచేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం రవీంద్ర హుడా అక్కడ గార్డుగా చేరాడు. ఇటీవల సెలవు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
సెలవు మంజూరు చేయకపోవడంతో పాటు జీతంలో కోత విధించారనే కారణంతో హుడా తీవ్ర అసహనానికి గురయ్యాడు. సోమవారం బ్యాంక్లోనే మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన మేనేజర్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఘటన తర్వాత పోలీసులు వేగంగా స్పందించి నిందితుడు రవీంద్ర హుడా (Hooda)తో పాటు అతని మిత్రుడు శిశుపాల్ను (Shishupal) అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.






