ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. ఎస్టి సామాజిక వర్గానికి చెందిన నక్క నాగేశ్వరరావు (Nakka Nageswara Rao) (40) గుండెనొప్పితో మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. వరి పొలాల వద్ద ఎలుకల బోనులు వేస్తూ జీవనం సాగిస్తున్న ఆయనను సోదరులు ద్విచక్ర వాహనంపై బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే వైద్యులు పరీక్షించిన అనంతరం అప్పటికే ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు.
మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఆస్పత్రిలో ‘మహాప్రస్థానం’ (Mahaprasthanam) వాహనం అందుబాటులో లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆటోను సంప్రదించారు. అయితే రూ.3,000 బాడుగ డిమాండ్ చేయడంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయింది. దాంతో దాదాపు పది కిలోమీటర్ల దూరం వరకు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపైనే తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.
ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పేదరికం, వైద్య సదుపాయాల లోపం, అత్యవసర సేవల అందుబాటు, ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ బాపట్ల ఏరియా ఆస్పత్రిలో ‘మహాప్రస్థానం’ వాహనం లేకపోవడం వాస్తవమని ఆయన అంగీకరించారు. ఈ విషాద ఘటన రాష్ట్రంలో అత్యవసర వైద్య మరియు మృతదేహ రవాణా సేవల స్థితిగతులపై మళ్లీ దృష్టిని సారింపజేసింది.






