కోట్లాది మంది భక్తులు కలియుగ దైవంగా ఆరాధించే తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Sri Venkateswara Swamy) రాజకీయాల్లోకి లాగి ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించినది ఎవరో ప్రజలకు తెలియాల్సిన సమయం వచ్చిందని వైఎస్సార్సీపీ(YSRCP) ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి (Varudu Kalyani) తీవ్ర విమర్శలు గుప్పించారు. మందలి సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
మంత్రులు సుద్ధపూసల్లా మాట్లాడుతున్నారని ఆమె విమర్శిస్తూ, తిరుపతి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం ఎవరు ప్రారంభించారో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. అసత్యాలతో ఫ్లెక్సీలు వేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసినవారు ఎవరో వెల్లడించాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరియు కూటమి నేతలు తమ వ్యాఖ్యలపై ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
సీబీఐ నివేదిక (CBI Report) వెలువడిన తర్వాత కూడా బాత్రూమ్ కెమికల్స్ కలిపారని మరోసారి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇందాపూర్, బోలేబాబా సంస్థలకు హెరిటేజ్ సంస్థతో (Heritage company) వ్యాపార సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని మేము సృష్టించలేదని, వారి అధికారిక వెబ్సైట్లోనే వివరాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇందాపూర్ అంశంపై బహిరంగ చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయలేకపోవడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనే తప్పుడు ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు. నెయ్యి టెండర్ల ద్వారా హెరిటేజ్కు లబ్ధి చేకూర్చుకున్నారని, అందుకే డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రజల విశ్వాసాలను గౌరవించి, డైవర్షన్ రాజకీయాలను విరమించి, ఇందాపూర్ అంశంపై సమగ్ర చర్చకు ముందుకు రావాలని వరుదు కళ్యాణి ప్రభుత్వాన్ని కోరారు.







