దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు (Cyber Frauds) రోజురోజుకు విస్తరిస్తూ, సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు కూడా వీటి బారిన పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. రోజుకు వందలాది మంది ఆన్లైన్ మోసాలకు గురై భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. పోలీసు శాఖ తరచూ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేయడం కొనసాగిస్తున్నారు.
ప్రత్యేకంగా సెల్ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులు, కాల్స్ను నిర్లక్ష్యంగా క్లిక్ చేయడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా ఈ మోసాలకు గురవడం గమనార్హం. బిజెడి ఎమ్మెల్యే తుషార్కాంతి బెహెరా రూ.1.4 కోట్లు కోల్పోగా, ఒక లోక్సభ ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి నకిలీ హెల్ప్లైన్ ద్వారా ₹1 లక్షకు పైగా నష్టపోయారు. మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ సైతం సైబర్ ముఠా చేతిలో రూ.2 కోట్లకు పైగా కోల్పోయిన ఘటన సంచలనం రేపింది.
తాజాగా పోలవరం జనసేన ఎమ్మెల్యే (Janasena MLA) చిర్రి బాలరాజు (Chirri Balaraju) కూడా సైబర్ మోసానికి గురైనట్లు సమాచారం. తన ఫోన్కు వచ్చిన ఆర్టీఏ చలాన్ లింక్ను (RTA Challan Link) ఓపెన్ చేయడంతో, ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.12 లక్షలు మాయం అయినట్లు వెల్లడైంది. వెంటనే స్పందించిన ఆయన పోలీసులను సంప్రదించి, జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో, అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైళ్లు, తెలియని యాప్లను డౌన్లోడ్ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అత్యవసరం. ప్రజల్లో అవగాహన పెంపు ద్వారానే ఈ మోసాలను అరికట్టడం సాధ్యమని అధికారులు సూచిస్తున్నారు.






