క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచే ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగియగా భారత జట్టు మూడోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ఐపీఎల్ టోర్నీపైనే (IPL Tournament – Indian Premier League) నిలిచింది. తాజా సమాచారం ప్రకారం మరో రెండు రోజుల్లో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ (Schedule) విడుదలయ్యే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
మార్చి 28న బెంగళూరులో హై వోల్టేజ్ మ్యాచ్?
నివేదికల ప్రకారం మార్చి 13 నాటికి తొలి దశ షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ను కూడా ఎంతో ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 28న బెంగళూరు (Bengaluru) వేదికగా జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ(RCB) మరియు సీఎస్కే(CSK) మధ్య హై వోల్టేజ్ పోరు జరిగే అవకాశం ఉందని సమాచారం.
సాధారణంగా గత సీజన్ ఫైనలిస్టుల మధ్యే టోర్నీ తొలి మ్యాచ్ నిర్వహించడం ఆనవాయితీ. కానీ దక్షిణాది డెర్బీగా గుర్తింపు పొందిన ఆర్సీబీ–సీఎస్కే మ్యాచ్కు ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉండటంతో ఈ మ్యాచ్తోనే టోర్నీ ప్రారంభించేలా నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక గత సీజన్ రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 29న ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో ఆడనుందని సమాచారం. అలాగే ఈ నెల 15న ఢిల్లీలో కెప్టెన్ల ఫొటో షూట్, 25న ముంబైలో కోచ్లు మరియు కెప్టెన్లతో కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.






