రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ అందించే రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మారబోతుందా? ఈ ప్రశ్న రాయలసీమ ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
రాష్ట్ర విభజన అనంతరం జూన్ 2014లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక జ్యుడిషియల్ అకాడమీ అవసరం ఏర్పడింది. అప్పటివరకు సికింద్రాబాద్లో కొనసాగిన అకాడమీ తెలంగాణ రాష్ట్రానికి వెళ్లడంతో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ రాష్ట్రంలో ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఆ మేరకు 2022లో న్యాయశాఖ కార్యదర్శి జి. సత్యప్రభాకర్ పేరుతో జీవో జారీ చేయబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీలో పనిచేసిన సిబ్బందిలో 58.32 శాతం మించకుండా సిబ్బందిని మంజూరు చేస్తూ కర్నూలులో శాశ్వత అకాడమీ ఏర్పాటుకు అనుమతి లభించింది.
అయితే తాజాగా విజయవాడ పటమటలోని అంత్రా లక్స్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టేట్ లెవెల్ సింపోసియం ఆన్ మీడియేషన్ – డైలాగ్ యాస్ కార్నర్ స్టోన్ ఆఫ్ జస్టిస్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని భారత దేశ ప్రధాన న్యాయమూర్తిని కొరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రకటించారు.
రాజధాని నిర్మాణంలో భాగంగా ‘జస్టిస్ సిటీ’లో జ్యుడీషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలను సమగ్రంగా ఏర్పాటు చేసి దేశంలోనే ఉత్తమ న్యాయ నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని వెల్లడించారు. అవసరమైన భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కర్నూల్కు రావాల్సిన రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ అమరావతికి తరలిపోతుందా అనే సందేహం ఉత్పన్నమైంది. ఇప్పటికే ప్రాంతీయ అసమానతలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న రాయలసీమ ప్రజల్లో ఈ అంశం అసహనాన్ని రేకెత్తిస్తోంది. గతంలో తీసుకున్న నిర్ణయాలు అమలవుతాయా? లేక కొత్త ప్రణాళికలతో మార్పులు చోటుచేసుకుంటాయా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానిక వర్గాలు భావిస్తున్నాయి.







