తిరువూరు (Tiruvuru) టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) కొలికపూడి శ్రీనివాస్ (Kolikapudi Srinivas) పార్టీ అధిష్టానానికి కోరకరాని కోయ్యగా మారారా అన్న ప్రశ్నకు ఇటీవలి పరిణామాలు అవుననే సంకేతాలను ఇస్తున్నాయి. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం కొంతకాలం సజావుగా సాగిన ఆయన రాజకీయ ప్రయాణం, ఇటీవల అధికార పార్టీయే లక్ష్యంగా మారిన దూకుడు వ్యాఖ్యలతో తీవ్ర వివాదాలకు దారి తీసింది.
స్థానిక టీడీపీ నేతలతో సమన్వయం కుదరకపోవడం, ముఖ్యంగా ఎంపీ కేసినేని చిన్ని (Kesineni Chinni)తో విభేదాలు తీవ్రతరమవడం వల్ల కొలికపూడి తరచూ సంచలన ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నారు. పరస్పర ఆరోపణలు, ఫోటోల విడుదల, సోషల్ మీడియా వేదికగా జరిగిన మాటల యుద్ధం పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. 2024 ఎన్నికల టికెట్ కోసం కోట్ల రూపాయలు అడిగారంటూ చేసిన ఆరోపణలు, డబ్బు లావాదేవీలపై ఫేస్బుక్ పోస్టులు పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి.
ఇక అక్రమ ఇసుక రవాణా, గంజాయి విక్రయాలు, పేకాట కేంద్రాలపై ఎంపీ అనుచరులపై చేసిన ఆరోపణలు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిన అధిష్టానం, తప్పు కొలికపూడిదేనని తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.
అయితే ఇవన్నీ జరుగుతున్న వేళ, గ్రామీణ సమస్యలపై కొలికపూడి చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. పల్లెల్లో ప్రజల కన్నీళ్లు, నిరుద్యోగం, రహదారుల్లేమి వంటి సమస్యలపై తన అనుభవాలను వాట్సాప్ స్టేటస్ ద్వారా వెల్లడించడంతో రాజకీయ వర్గాల్లో కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. పార్టీ అవినీతిని బయటపెడుతున్న నేతగా ఆయనను సస్పెండ్ చేస్తారా? లేక ఆయన దూకుడును తట్టుకోలేక టీడీపీ మిన్నకుండిపోతుందా? అన్న సందేహాలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి.






