మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) నివాసంపై జరిగిన దాడి, అనంతరం ఆయన అరెస్టు అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ(YSRCP) నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) అంబటి రాంబాబును పరామర్శించి, జరిగిన పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిపై దాడి చేసి, ఆయన్నే అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయసమ్మతమని ప్రశ్నించారు. అరెస్టుల ద్వారా వైసీపీలో ఉన్న కాపు నాయకులు భయపడతారని భావించడం తగదని ఆయన హెచ్చరించారు.
కాపుల ఓట్లతో (Kapu Votes) అధికారంలోకి వచ్చి, అదే వర్గంపై దాడులు చేయడం లక్ష్యమా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో తనను, తన కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధించారని, పోలీసుల ద్వారా అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రస్తుతం అంబటి రాంబాబు మరియు ఆయన కుటుంబంపై కూడా అదే విధమైన చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
రాజకీయ భేదాభిప్రాయాల పేరుతో ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి అనుకూలం కాదని ముద్రగడ హితవు పలికారు. రేపటి రోజున ఇదే పరిస్థితి తమకూ ఎదురైతే ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచిస్తూ, వైసీపీలో ఉన్న కాపు నేతలపై టార్గెట్ చేసి వేధింపులు నిలిపివేయాలని కోరారు.







