పశ్చిమాసియాలో (West Asia) నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల (War Tensions) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం “నా దేశం–నా బాధ్యత”(“My Nation–My Responsibility”) పేరుతో పొదుపు చర్యలకు (Savings Measures) శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ కార్యక్రమం ప్రారంభించి నెల కూడా గడవకముందే ఆ ప్రచారం పూర్తిగా అటకెక్కిందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా మంత్రులు, అధికారులు తమ వాహనాల వినియోగాన్ని తగ్గించి ఇంధన పొదుపుపై (Fuel Savings) దృష్టి పెట్టాలని సూచించారు. కార్యాలయాల్లో ఏసీలను (ACs) 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం ద్వారా విద్యుత్ ఆదా చేయాలని, ప్రభుత్వ వాహనాలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే అవకాశాలను పరిశీలించాలని పిలుపునిచ్చారు. అలాగే బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవడం, వ్యక్తిగత మరియు అధికారిక విదేశీ పర్యటనలను అత్యవసరం అయితే తప్ప నివారించడం, శాఖల సమావేశాలను సాధ్యమైనంత వరకు ఆన్లైన్లో నిర్వహించడం వంటి పలు సూచనలు చేశారు.
అంతేకాకుండా ప్రతి శాఖలో అమలు చేయగలిగే పొదుపు చర్యలపై కార్యదర్శులు నివేదికలు ఇవ్వాలని, వాటి పర్యవేక్షణ కోసం ప్రత్యేక క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ప్రతి శుక్రవారం “నో వెహికల్ డే” గా పాటించాలని సూచిస్తూ ప్రజలకు, అధికార యంత్రాంగానికి ఆదర్శంగా నిలుస్తామని భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు.
అయితే ఈ కార్యక్రమం కేవలం కొద్ది రోజుల ప్రచారానికే పరిమితమైందన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. “నో వెహికల్ డే”గా (“No Vehicle Day”) ప్రకటించిన శుక్రవారం రోజే భారీ బహిరంగ సభలు నిర్వహించడం, వందలాది వాహనాల్లో కార్యకర్తలను తరలించడం, ముఖ్య నేతలు ప్రత్యేక విమానాల్లో సభలకు హాజరుకావడం వంటి పరిణామాలు ప్రభుత్వమే ప్రకటించిన పొదుపు సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు.
పొదుపు చర్యలను ప్రజలకు బోధించే ముందు ప్రభుత్వం స్వయంగా వాటిని ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో చెప్పిన అంశాలు కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకు చేసిన ప్రకటనలుగానే ఉన్నాయనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో “నా దేశం–నా బాధ్యత” అనే నినాదం నాలుగు రోజుల ప్రచారానికే పరిమితమై అటకెక్కిందా? అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.






