రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతపై వస్తున్న ఆరోపణలు మరింత తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై తీవ్ర విమర్శలు చేశారు. రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై పత్రికల్లో వార్తలు, సోషల్ మీడియాలో వీడియోలు వెలువడుతున్నప్పటికీ మంత్రి స్పందించలేదని ఆయన ఆరోపించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా విదేశాల్లో క్రికెట్ మ్యాచ్లు చూడటంలోనే మంత్రి ఆసక్తి చూపుతున్నారని ఎద్దేవా చేశారు.
మైలవరం తారకరామ నగర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత బాగోలేదని హెడ్ మాస్టర్ డ్రామా చేశాడంటూ ఒక పత్రికలో వార్త వెలువడిన నేపథ్యంలో, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడనే కారణంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఆయనను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే వాస్తవానికి వంట నాణ్యత బాగోలేదని విద్యార్థులు పలుమార్లు ఫిర్యాదు చేస్తున్నారని, ఆ విషయాన్ని హెడ్ మాస్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పేర్ని నాని చెప్పారు.
ఎంక్వైరీకి వెళ్లిన అధికారుల ముందు విద్యార్థులే అన్నం బాగోలేదని ఏడుస్తూ చెప్పినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగడంతో మంత్రి నారా లోకేష్ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు హెడ్ మాస్టర్ను బలిగా తీసుకున్నారని విమర్శించారు.
విద్యాశాఖను సమర్థంగా నిర్వహించలేని పరిస్థితిలో ఉంటే మంత్రి పదవిలో కొనసాగడంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే బాధ్యతను నిర్వర్తించకుండా బయట కార్యక్రమాల్లో కాలం గడపడం ద్వారా ప్రజలకు మేలు జరగదని పేర్ని నాని వ్యాఖ్యానించారు.






