విశాఖపట్నం (Visakhapatnam)లో దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి సంబంధించి జగన్మోహన్రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) హయాంలో సలీగ్రామపురంలో పోర్ట్ ఆసుపత్రి సమీపంలోని 17 ఎకరాల భూమిని రహేజా గ్రూప్ బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్ (Build–Operate–Transfer (BOT)) విధానంలో 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. నాడు మార్కెట్ విలువ ఆధారంగా రూ.125 కోట్ల లీజు మొత్తాన్ని నిర్ణయిస్తూ రెండు పక్షాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందం ప్రకారం 30 ఏళ్ల అనంతరం భూమి మరియు నిర్మాణాలు పోర్ట్ అథారిటీకి హస్తాంతరం కావాల్సి ఉంటుంది. అవసరమైన పక్షంలో మళ్ళీ లీజు పోడించుకునే వేసులుబాటు కల్పించారు అదీ అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా.
సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్ నిర్మాణం, అదనంగా 4 లక్షల చదరపు అడుగుల పార్కింగ్ సదుపాయం, 250కిపైగా అంతర్జాతీయ బ్రాండ్లు, 8,000 మందికి ఉపాధి అవకాశాలు వంటి అంశాలతో ఈ ప్రాజెక్టు ను రహేజా ప్రారంభించింది. అలాగే రెండో దశలో ఐటీ క్యాంపస్, మూడో దశలో స్టార్ హోటల్ నిర్మాణ ప్రణాళికలను కూడా సంస్థ నాడే వెల్లడించింది.
అయితే ఇదే రహేజా గ్రూప్ (Raheja Group)కు ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో కేవలం 99 పైసలకే భూమి కేటాయింపు జరగడం దానిని మంత్రి లోకేష్ (Nara Lokesh) మండలిలో సమ్ర్ధించుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. ఒకే సంస్థకు వేర్వేరు ప్రభుత్వాల సమయంలో భూమి కేటాయింపుల విధానంలో ఉన్న తేడాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మార్కెట్ విలువ ఆధారంగా లీజు తీసుకున్న సంస్థ, మరో సందర్భంలో తక్కువ ధరకు భూమి పొందడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తున్నది. ప్రభుత్వాల విధానాలు, పెట్టుబడుల ఆకర్షణలో పారదర్శకత, ప్రజా ఆస్తుల పరిరక్షణ వంటి అంశాలపై ఈ పరిణామం మరింత చర్చకు దారితీసే అవకాశముంది.






