రాయచోటి (Rayachoti)లో 104 అంబులెన్స్ల (104 Ambulances) మాయం వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. వైయస్ జగన్ (YS Jagan) హయాంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital)లో ప్రవేశపెట్టిన 104 అంబులెన్స్ సేవలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాహణలోపాల కారణంగా నిలిచిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో అంబులెన్స్లను మరమ్మతుల పేరుతో తీసుకెళ్లి షెడ్డుకు తరలించి, వాటిని విడిభాగాలుగా చేసి విక్రయించారనే ఆరోపణలు మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) అనుచరులపై వెలువడ్డాయి. విషయం బయటపడిన అనంతరం ఆరు నెలల తర్వాత అంబులెన్స్లు దొంగతనానికి గురయ్యాయని వైద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ అంశంపై వైసీపీ(YSRCP) తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వీడియో ఆధారాలతో పోస్టు చేయడంతో వివాదం మరింత ముదిరింది.
పేదల ఆరోగ్య సేవలకు వినియోగించే వాహనాలపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఘటనలోని నిజానిజాలను వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందన ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.






