రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తరువాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ (Social Media Trolling) సమస్య తీవ్రంగా పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం(TDP) మరియు జనసేన పార్టీలకు (Jana Sena Party మద్దతుగా ప్రచారం చేసే కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు తమకు నచ్చని పోస్టులపై అసభ్య పదజాలంతో దాడులు చేస్తున్నారని పలువురు మేధావులు, జర్నలిస్టులు (Journalists) బహిరంగంగా ఆరోపిస్తున్నారు. కూటమి పాలనకు సంబంధం లేని వ్యక్తిగత పోస్టులకు కూడా రాజకీయ రంగు పులిమి తీవ్ర విమర్శలు, బెదిరింపులు చేయడం రాష్ట్రంలో ట్రోలింగ్ సంస్కృతి ఎంత తీవ్రంగా మారిందో చూపిస్తోంది.
ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసీ చందు, లాయర్ రజనీ, సామాజిక కార్యకర్త ఐశ్వర్య బోజ్జా, ఇండిపెండెంట్ జర్న్లలిస్ట్ విజయ లక్ష్మీ, సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి, జర్నలిస్ట్ సాయి వంటి వారు తమపై సోషల్ మీడియాలో జరిగిన బూతుల దాడులు (Abusive Attacks), బెదిరింపులు, ట్రోలింగ్ ఘటనలను పలు సందర్భాల్లో బహిరంగంగా వెల్లడించారు. ప్రభుత్వానికి ప్రతి విషయంలో మద్దతు ఇవ్వకపోవడమే కారణంగా ఈ దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొందరు పోలీసులను కూడా ఆశ్రయించారు.
తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. బిగ్ టీవీలో పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి (Journalist Ashok Vemulapalli) తన కుమారుడు చదువుతున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ (Y.S. Jagan Mohan Reddy) దిగిన ప్రదేశంలోనే తన కుమారుడు కూడా ఫోటో దిగాడని పేర్కొంటూ ఒక పోస్టు చేశారు. అయితే ఆ పోస్టు వెలువడిన వెంటనే కొంతమంది తెలుగుదేశం మద్దతుదారులు జర్నలిస్ట్ అశోక్ వేములపల్లిపై మాత్రమే కాకుండా అతని కుమారుడిపై కూడా అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోలింగ్ ప్రారంభించారు.
దీంతో ఈ పరిస్థితిని తప్పుబడుతూ అశోక్ వేములపల్లి మంత్రి నారా లోకేష్ను(Nara Lokesh) ట్యాగ్ చేస్తూ ఒక పోస్టు పెట్టారు. అయితే కొద్దిసేపటి తరువాత ఆ పోస్టును తొలగించారు. అప్పటికే ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి టీడీపీ–జనసేన మద్దతుదారుల ట్రోలింగ్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయని విమర్శకులు గుర్తుచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా జగన్ ప్రభుత్వం ద్వారా ఇళ్ల పట్టా పొందిన గీతాంజలి (Geethanjali) అనే మహిళ తన ఆనందాన్ని వ్యక్తం చేయగా ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ జరిగిందని, అది ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడిన వీడియో వైరల్ అయినప్పుడు మైనర్ పిల్లలు అని కూడా చూడకుండా వేలాది సోషల్ మీడియా ఖాతాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయని అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నా లేకున్నా కొన్ని రాజకీయ వర్గాల మద్దతుదారుల నుంచి సోషల్ మీడియాలో జరిగే ఈ విధమైన దాడులు అడ్డుకట్ట లేకుండా కొనసాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయడం ప్రభుత్వంతో పాటు సామాజిక బాధ్యత కలిగిన సోషల్ మీడియా వినియోగదారులందరి బాధ్యత అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి విభిన్న అభిప్రాయాలను గౌరవించే సంస్కృతి పెంపొందాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.






