మహాశివరాత్రి (Maha Shivaratri) పర్వదినం సందర్భంగా శ్రీశైల (Srisailam)క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోతోంది. విద్యుద్దీపాలతో వెలుగొందుతున్న ఈ శైవక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం రోజురోజుకూ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీశైలం దేవస్థానం వద్ద జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు వాహనదారులకు టోల్ ఫీజు (Toll Fee) నుంచి మినహాయింపు (Exemption) కల్పిస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి (Rajakumari) ప్రకటించారు. శ్రీశైలం దేవస్థానం (Srisailam Devasthanam) మరియు అటవీశాఖ ఆధ్వర్యంలోని టోల్ గేట్ల వద్ద ఈ సౌకర్యం అమలులో ఉంటుందని తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి నిన్నటి వరకు మొత్తం 2,59,050 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం నంద్యాల–శ్రీశైలం మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు నడిచేలా చర్యలు తీసుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీ నుంచి 1800 బస్సులు, తెలంగాణ ఆర్టీసీ నుంచి 1000 బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి మరో 200 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లతో మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి వచ్చే భక్తులకు పెద్ద ఊరట లభించనుంది.






