ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు ఎప్పటికప్పుడు అనూహ్య మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందా అనే చర్చలు రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఒకవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) లెక్కలు, డేటాలు, సాక్ష్యాలతో విమర్శలు చేస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు తెలుగుదేశం పార్టీ మీడియా బలం, రాజకీయ ప్రతిదాడులతో ముందుకు సాగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
2024 సెప్టెంబర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన తిరుమల లడ్డూ ప్రసాదంలో (Tirumala Laddu Prasadam) జంతు కొవ్వు (Animal Fat) కలిపారని చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. అయితే ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని అప్పటినుంచి పలువురు ప్రశ్నిస్తుండగా, సిట్(SIT) నివేదిక వెలువడిన తరువాత పరిస్థితులు మరింత సంక్లిష్టమయ్యాయి. దీంతో టిడిపి పూర్తిగా రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లిందనే అభిప్రాయం బలపడుతోంది.
ఇదే సమయంలో హెరిటేజ్ సంస్థతో (Heritage Organization) వ్యాపార బంధం ఉన్న ఇందాపూర్ సంస్థకు (Indapur company) సంబంధించిన నెయ్యి టెండర్ల అంశం, అధిక ధరల ఆరోపణలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఈ పరిణామాల నడుమ వైయస్సార్ కాలంలో తిరుమల ఏడు కొండలు శ్రీవారికే చెందుతాయని జారీ చేసిన జీవోపై చర్చ మళ్లీ ముందుకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ 7 కొండలు శ్రీవారివే అని తీసుకున్న నిర్ణయం, దానిని రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారనే వీడియోలో కనిపించిన వ్యాఖ్యల కారణంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసెంబ్లీలో స్వామివారి చిత్రాల ప్రస్తావన, సభ్యులు చెప్పులు ధరించి ఉన్నారనే వాదనలు, అలాగే గతంలో చంద్రబాబు గారు బూట్లు వేసుకుని పూజల ఫోటోలు ఇవన్నీ రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఆధునిక దేవాలయంగా భావించే అసెంబ్లీలో దేవుడు ఫోటోలు తేవడం తప్పేం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తానికి, లడ్డూ వివాదంతో ప్రారంభమైన ఈ రాజకీయ పోరు అనేక మరుగున పడిన అంశాలను వెలికి తీస్తూ, అధికార పార్టీపై మరింత ఒత్తిడిని సృష్టిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా మలుపుతిరుగుతాయో అన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.







