దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై (Tirumala Laddu Prasadam) తీవ్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రముఖ విశ్లేషకుడు మరియు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు (Professor Nageswara Rao) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రముఖ మీడియా చానల్లో మాట్లాడిన ఆయన, సీబీఐ చార్జ్షీట్ (CBI Charge Sheet) ఆధారంగా తాను వ్యాఖ్యానిస్తుండగా, దానికి విరుద్ధంగా మీడియాలో మాట్లాడాలని తనపై ఫోన్ ద్వారా ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు.
లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు లేదా ఇతర హానికర పదార్థాలు కలిసాయని చెప్పాలంటూ తనను బలవంతపెట్టారని, అలా మాట్లాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. దాదాపు 20కు పైగా ఫోన్ నెంబర్ల నుంచి దూషణలు, బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఒక నెంబర్ను తాను స్వయంగా లోకేష్(Lokesh)కు పంపినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని, చివరకు ఆయన సమీపంలోని వ్యక్తిని కలిసిన తర్వాత మాత్రమే ఆ నెంబర్ నుంచి కాల్స్ ఆగాయని తెలిపారు. అయితే, మిగిలిన నెంబర్లపై చర్యలు ఎలా తీసుకుంటారన్నది తనకు ప్రశ్నగానే మిగిలిందని అసహనం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, లడ్డూ అంశాన్ని ఒక వర్గం కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. ఒక పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పవిత్రమైన ప్రసాదాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ డ్రామాకు తెరలేపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, తిరుమల లడ్డూ వంటి పవిత్ర ప్రసాదం పవిత్రతను దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేయడం సరికాదని, ఇది హిందూ సమాజ భావోద్వేగాలను గాయపరచే పరిణామమనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమవుతోంది.






