తిరుమల పరకామణి చోరీ కేసు (Tirumala Parakamani Theft Case) మళ్లీ నమోదు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు టీటీడీ(TTD) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో వైసీపీ నేతలను నిందితులుగా చేర్చే బాధ్యతలను ఒక డీఎస్పీకి అప్పగించినట్లు తమకు సమాచారం అందిందన్నారు. మరో రెండు రోజుల్లో టీటీడీ ద్వారా కొత్త ఫిర్యాదు చేయించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.
ఇప్పటికే ఇద్దరు డీజీ స్థాయి అధికారులు విచారణ చేసి కోర్టుకు నివేదిక సమర్పించినప్పటికీ, మళ్లీ తక్కువ స్థాయి అధికారితో విచారణ జరిపించి తమకు అనుకూలంగా నివేదిక తయారు చేయించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ చర్యలు వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని తీసుకున్న నిర్ణయాలేనని విమర్శించారు.
అదేవిధంగా తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ (Tirumala Laddu Ghee Adulteration) అంశంపై ఏకసభ్య కమిషన్ (Single-Member Commission) ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టేనని వ్యాఖ్యానించారు. ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతుండగా మరో కమిషన్ వేయడం సరైన విధానం కాదని తెలిపారు. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టు తప్పుపడే అవకాశముందని, ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు.






