తిరుమలలో మరోసారి సంచలనం (టీటీడీ) చైర్మన్గా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడు పై వచ్చిన ఆరోపణలు రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఇప్పుడు ఆరోపణలకి కేంద్రబిందువుగా ఉన్న మహిళ గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ కు రాసిన లేఖ వైసీపీ బయట పెడ్డటంతో తీవ్ర దుమారానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ లేఖలో ఆమే తాను హైదరాబాదుకు చెందిన ఇంధు లేఖగా చెప్పుకున్నారు, ఆ లేఖలో బీఆర్ నాయుడు గత 25 ఏళ్లుగా తనను మోసగించారని, “ఆత్మీయ సహాయం” పేరుతో తన వద్దకు చేరుకుని అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.
ఆ లేఖలో పేర్కొన్న ప్రతి అంశానికి తాను కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. తన వద్ద ఉన్న వీడియోలు, రికార్డుల కారణంగా ఇంతకాలం మౌనం వహించాల్సి వచ్చిందని తెలిపారు. పలుమార్లు వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి తరువాత తప్పించుకున్నారని, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు.
ఈ లేఖను మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రజల ముందుకు తీసుకువచ్చారు. లేఖ బయటకు వచ్చిన తరువాత బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ జరిపితే అసలు నిజాలు బయటపడతాయని హెచ్చరించారు. రాజీనామా చేయకపోతే మరిన్ని వాస్తవాలు బయటపెడతామని కూడా పేర్కొన్నారు.

ఇంధు లేఖ తన కుటుంబ జీవితం, ఆరోగ్యం, గౌరవం దెబ్బతిన్నాయని లేఖలో పేర్కొన్నారు. టీటీడీ వంటి పవిత్రమైన సంస్థలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కొనసాగడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని నారా లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? టీటీడీ చైర్మన్ రాజీనామా చేస్తారా? లేక విచారణ ద్వారా నిజానిజాలు వెలుగులోకి వస్తాయా? తిరుమలలో తలెత్తిన ఈ వివాదం ఎటు దారి తీస్తుందన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.







