ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల పరకామణి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రెండు వేర్వేరు ప్రభుత్వాల కాలంలో జరిగిన దొంగతనాలపై టీడీపీ అనుకూల మీడియా కథనాలు మరియు కూటమి నేతల రాజకీయ వ్యాఖ్యలు భిన్నంగా ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
జగన్ గారి పాలన సమయంలో పరకామణిలో పనిచేసే రవి కుమార్ అనే ఉద్యోగి సుమారు 72 వేల రూపాయల విలువైన అమెరికన్ డాలర్లు దొంగిలించినట్టు విచారణలో తేలింది. అయితే ఈ ఘటనను కొందరు జగన్ గారిపై నెపం నెడుతూ పెద్ద దొంగతనంగా ప్రస్తావించి విమర్శలు చేశారు. అదే సమయంలో దొంగతనానికి సంబంధించిన పరిణామాల్లో భాగంగా జగన్ గారి పాలానా హయాంలోనే రవి కుమార్కు చెందిన సుమారు 15 కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీ పేరిట రాయించుకున్నారు. అయితే ఈ చర్యను కొందరు కఠిన శిక్షగా పేర్కొనగా, కొందరు టీడీపీ నేతలు, అలాగే టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఈ శిక్షను పలుచన చేస్తూ రకరకాల ఆరోపణల దాడికి దిగింది.
ఇక మరోవైపు చంద్రబాబు గారి పాలనలో పరకామణిలో జరిగిన మరో చోరీ ఘటనను టీడీపీ అనుకూల మీడియా పలుచన చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య సుమారు ఒక కోటి రూపాయల విలువైన 555 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి కానుకలను దొంగిలించినట్టు వెలుగులోకి వచ్చినప్పటికీ, ఆ ఘటనపై తీసుకున్న చర్యలు ఎంతవరకు కఠినంగా ఉన్నాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది. పెంచలయ్య కనీసం నెలరోజులైనా జైలులో ఉన్నాడా అనే సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ గారి పాలనలో జరిగిన చోరీ విషయంలో చేసిన యాగీ ఇప్పుడు ఎందుకు టీడీపీ అనుకూల మీడియా చేయడంలేదనే ప్రశ్న ప్రజల నుండి వస్తుంది.
ఈ రెండు ఘటనలను పోల్చుతూ రాజకీయ వర్గాల్లో “మీడియా ప్రొజెక్షన్” పై మరోసారి చర్చ మొదలైంది. ఒకే విధమైన ఘటనలను వేర్వేరు విధాలుగా చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిని అకారణంగా టార్గెట్ చేస్తున్నట్టు, మరోకరిని విపరీతంగా కాపాడుతునట్టు స్పష్టంగా కనిపిస్తుందని ఈ విధమైన జర్నలిజం ప్రజాస్వామ్యానికి చేటని పలువురు తమ అభిప్రాయన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే పరకామణి వ్యవస్థలో భక్తులు సమర్పించే విలువైన కానుకల భద్రత, పారదర్శకతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.






