వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేత వెల్లంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Naidu Government) చేసిన తప్పులను ఇప్పటికీ ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. దేవుడి ప్రసాదం విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ఏడాది సెప్టెంబర్లో లడ్డూలో యానిమల్ ఫ్యాట్ (Animal Fat) కలిసిందని ఆరోపణలు చేసిన కూటమి నేతలు, ఇప్పుడు సీబీఐ సిట్ నివేదిక వచ్చినా నిజాన్ని అంగీకరించడం లేదని అన్నారు.
సీబీఐ(CBI) సిట్(SIT) స్పష్టంగా లడ్డూలో ఎక్కడా యానిమల్ ఫ్యాట్ ఆనవాళ్లు లేవని నివేదిక ఇచ్చిందని వెల్లంపల్లి గుర్తు చేశారు. ఆ సిట్లో ఉన్న అధికారులు కూడా ప్రభుత్వమే నియమించినవారేనని, అయినా ఛార్జ్షీట్లో యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టత ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటికీ రిపోర్ట్పై బుకాయిస్తూ అబద్ధాలు మాట్లాడుతున్నారని కూటమి నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు లేదా ఫిష్ ఆయిల్ కలిసిందని నిరూపించగలరా అంటూ ఆయన సవాల్ విసిరారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని సమయంలో డైవర్షన్ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని వెల్లంపల్లి ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారాలు చేయడం సరికాదని, ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యానిమల్ ఫ్యాట్ అంశాన్ని ప్రజలు నమ్మకపోవడంతో ఇప్పుడు యాసిడ్స్ కలిపారనే కొత్త కథ తెరపైకి తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.
గత వైసీపీ(YSRCP) ప్రభుత్వ హయాంలో లడ్డూ నాణ్యతపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే తిరుమలలో అనేక వివాదాలు చోటుచేసుకున్నాయని వెల్లంపల్లి అన్నారు. అయోధ్యకు లక్ష లడ్డూలు పంపించారంటూ ఆధారాలు లేకుండా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్లే కూటమి నేతలు అపహాస్యం పాలయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.






