ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు మరోసారి వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు (AP Assembly Sessions) మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) హాజరుకానున్నారనే సమాచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
గవర్నర్ ప్రసంగానికి జగన్ హాజరు?
సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం (Governor’s Address) సందర్భంగా సభకు హాజరుకావాలని వైసీపీ నాయకత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కూడా బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగానికి వైఎస్ జగన్ హాజరైన విషయం తెలిసిందే. అదే తరహాలో ఈసారి కూడా ఆయన సభలో పాల్గొనవచ్చని సమాచారం.
గురువారం (ఫిబ్రవరి 12) వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత అసెంబ్లీలో పార్టీ అనుసరించబోయే వ్యూహం, పాల్గొనే రోజులు వంటి అంశాలపై స్పష్టత రానుంది. శాసనమండలి సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్సీలు యథావిధిగా హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కూటమి ప్రభుత్వంపై విమర్శలు, వైసీపీ నేతలపై జరిగిన దాడులు, తిరుమల లడ్డూ వివాదం వంటి అంశాలను సభలో ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. 10.30 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై సమావేశాల వ్యవధిపై నిర్ణయం తీసుకోనుంది. దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.






