తిరుమల వంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే ప్రయత్నాలు ఇటీవలి కాలంలో పెరిగాయి. అయితే నిజంగా ఎవరు తిరుమల ప్రతిష్టను పెంచారు? ఎవరి పాలనలో శ్రీవారి ఆలయానికి, అనుబంధ దేవాలయాలకు మేలు జరిగింది? అన్న ప్రశ్నలకు చరిత్రే సమాధానం ఇస్తుంది.
వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల ఏడు కొండల పవిత్రతను కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్యమత ప్రచారాన్ని అడ్డుకునే ఆర్డినెన్స్, నిరాధరణకు గురైన అనేక దేవాలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకురావడం, ఆనందనిలయ స్వర్ణీకరణ, పేదల కోసం సామూహిక వివాహాలు, అర్చకులు–పూజారుల సంక్షేమం వంటి చర్యలు తిరుమల ప్రతిష్టను మరింత పెంచాయి. అలాగే లడ్డూ పవిత్రతకు జీఐ ట్యాగ్, ప్లాస్టిక్ నిషేధం వంటి నిర్ణయాలు భక్తుల విశ్వాసాన్ని బలపరిచాయి.
జగన్ మోహన్ రెడ్డి పాలనలోనూ ఈ సంప్రదాయం కొనసాగింది. ప్రసాదాలు, లడ్డూల నాణ్యత కోసం ఆధునిక ల్యాబ్లు, శుద్ధ నెయ్యి కోసం గోశాలలు, అర్చకుల జీతాల పెంపు, దేశవిదేశాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వేలాది దేవాలయాల నిర్మాణం వంటి చర్యలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం, పరాకామణి ఆధునీకరణ వంటి నిర్ణయాలు సంస్థను మరింత బలోపేతం చేశాయి.
అయితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన కొన్ని చర్యలు మాత్రం ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి. చారిత్రాత్మక వెయ్యి కళ్ల మండపం కూల్చివేత, ఎస్వీబీసీ ఛానల్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడటం, తిరుమల వ్యవహారాలను కోర్టు వివాదాల వైపు నెట్టడం వంటి అంశాలు విమర్శలకు దారి తీశాయి. తాజాగా లడ్డూ కల్తీ ఆరోపణల పేరుతో భక్తుల మనోభావాలను కలవరపెట్టే ప్రచారం కూడా ప్రశ్నార్థకంగా మారింది.
ఈ నేపథ్యంలో వైయస్సార్, జగన్ హయాంలో తిరుమల అభివృద్ధి, సంప్రదాయాల పరిరక్షణ కోసం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో స్పష్టంగా కనిపిస్తాయని పలువురు ఆధ్యాత్మిక వేత్తలనుండి వినిపిస్తున్న మాట. రాజకీయ ఆరోపణలకన్నా నిజాలను తెలుసుకుని తిరుమల పవిత్రతను కాపాడుకోవడం ప్రతి భక్తుడి బాధ్యతగా నిలవాలని ఆద్యాత్మికవేత్తలే అభ్యర్ధించడం విశేషం.






