టీ20 క్రికెట్లో నమీబియా మరోసారి సంచలన విజయం సాధించింది. పటిష్టమైన సౌతాఫ్రికాను 18 పరుగుల తేడాతో ఓడించింది. గతేడాది అక్టోబర్లోనూ సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా.. 10 నెలల వ్యవధిలోనే మరోసారి అదే జట్టుపై గెలవడం విశేషం. ట్రై సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో నమీబియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ 60 పరుగులతో రాణించగా.. లారెన్ స్టీన్కాంప్ 41 పరుగులు చేశాడు. కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 19 పరుగులు చేయడంతో నమీబియా పోరాడే స్కోరు సాధించింది.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను నమీబియా బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. రూబెన్ ట్రంపెల్మాన్, జేజే స్మిత్ చెరో 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ను దెబ్బతీశారు. డెవాల్డ్ బ్రెవిస్ 75 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా.. 18వ ఓవర్లో ట్రంపెల్మాన్ బౌలింగ్లో ఔటవ్వడంతో సౌతాఫ్రికా ఆశలు సన్నగిల్లాయి.
డువాన్ జాన్సెన్ 25 పరుగులతో నాటౌట్గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో సౌతాఫ్రికాకు 28 పరుగులు అవసరమైన సమయంలో జేజే స్మిత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి కేవలం 9 పరుగులే ఇచ్చాడు. దీంతో నమీబియా 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సౌతాఫ్రికాపై మరో చారిత్రాత్మక గెలుపును నమోదు చేసింది.






