తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఆయన కేసీఆర్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకోగా, ఇప్పుడు జగిత్యాలలో జరిగే సభపై అందరి దృష్టి నిలిచింది.
కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి చేరిక
ఈ నెల 20న సాయంత్రం 05 గంటలకు జగిత్యాల పట్టణంలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. జిల్లా కేంద్రంలోని మోతె రోడ్ వద్ద భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సభ ఏర్పాట్లను జీవన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ నాయకులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణం, మోతె రోడ్, కాలేజ్ గ్రౌండ్ ప్రాంతాలను పరిశీలిస్తూ సభ నిర్వహణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, లోక్ బాపు రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ 20న జరిగే ఈ సభకు సుమారు 1 లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ కోసం ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో కేసీఆర్తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ రావాలని, ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని వ్యాఖ్యానించారు.






