---Advertisement---

మావిగన్ ప్రతిపాదనకు పెరుగుతున్న మద్దతు!

April 10, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అమరావతి కోసం ప్రారంభంలో సేకరించిన 50 వేల ఎకరాల్లోనే రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు భారీగా ఖర్చు అవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. కేంద్రం మరియు బ్యాంకులకు సమర్పించిన లెక్కల ప్రకారం ఎకరానికి సుమారు రూ.2 కోట్లు ఖర్చవుతుందని, దీంతో మొత్తం రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని వెల్లడైంది. భవనాల నిర్మాణ ఖర్చులు దీనికి అదనంగా ఉండనున్నాయి.

ఇదే సమయంలో మరో 50 వేల ఎకరాల భూమి సేకరణ ప్రతిపాదన రావడంతో మొత్తం వ్యయం రూ.2 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఈ ఖర్చు మరింత పెరిగి రూ.10 లక్షల కోట్లకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుంటే ఈ ప్రాజెక్ట్ అమలు సాధ్యసాధ్యాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మావిగన్ ప్రతిపాదనను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు తెచ్చారు. ఇప్పటికే పోర్టు, సముద్ర తీరం, విమానాశ్రయం, రైల్వే స్టేషన్, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలను అనుసంధానిస్తూ రాజధాని అభివృద్ధి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధ్యమని ఆయన సూచిస్తున్నారు. అమరావతిలో కేవలం మౌలిక సదుపాయాలకే ఖర్చయ్యే మొత్తం వ్యయంలో కేవలం 10 శాతం, అంటే సుమారు రూ.20 వేల కోట్లతో మావిగన్‌ను అభివృద్ధి చేయవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ఈ ప్రతిపాదనకు ప్రజల నుండి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో వాదోపవాదాలు ముదురుతున్నాయి. అమరావతి ప్రాజెక్ట్ ఆచరణ సాధ్యతపై సమగ్ర చర్చ జరపకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం రాజకీయ నేతల వైఖరిపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలను కలుపుతూ మావిగన్ కారిడార్‌గా రాజధాని అభివృద్ధి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? గ్రీన్ ఫీల్డ్ నగర నిర్మాణంతో పోలిస్తే ఇది ఎంతవరకు ప్రయోజనకరం? వంటి ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలన్నింటి మధ్య ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజధాని దిశ ఏంటి అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment