ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి మరోసారి బహిర్గతమైంది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు వినూత్నంగా గుండు చేయించుకుని, “ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు” అంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు ఉద్యోగులు, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని వారు ఆరోపించారు.
ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా పీఆర్సీ, ఐఆర్, డీఏలు సహా కీలక హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఈ కారణంగా ఉద్యోగులు సుమారు రూ.32 వేల కోట్లు నష్టపోయారని, పాత బకాయిలతో కలిపి మొత్తం బకాయిలు రూ.50 వేల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఒక్కో ఉద్యోగికి సగటున రూ.5 లక్షలకు పైగా, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రూ.2 లక్షలకు పైగా నష్టం జరిగిందని తెలిపారు.
సరెండర్ లీవులు, పోలీసులకు చెల్లించాల్సిన బిల్లులు వంటి అనేక బకాయిలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి, వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ, గత నెలలోనే 10 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఫెడరేషన్ పేర్కొంది. “సర్” ప్రోగ్రామ్ పేరుతో అధిక ఒత్తిడి తెస్తున్నారని, పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారని విమర్శించారు.
పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు దాటినా ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా, తల్లిదండ్రుల మొబైళ్లలో యాప్లు డౌన్లోడ్ చేయించడానికే సమయం వెచ్చించాల్సి వస్తోందని ఉద్యోగ సంఘం ఆరోపించింది.
ఉద్యోగుల సమస్యలపై మిగతా ఉద్యోగ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన ఫెడరేషన్, ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని విమర్శించింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసింది.






