విశాఖపట్నం బీచ్లో (Visakhapatnam Beach) ‘బీచ్ షాక్స్’ (Beach Shacks) పేరిట మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ‘ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు? అందరూ తాగుతున్నారు కదా’ అంటూ టీడీపీ (TDP) విశాఖ ఎంపీ శ్రీభరత్ (Sri Bharat) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. గోవా తరహాలో విశాఖ బీచ్లో ‘బీచ్ షాక్స్’ పేరిట మద్యం పాలసీ తీసుకురావడానికి ఏపీ అసెంబ్లీలో (AP Assembly) తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు.
అయితే ఎంపీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మహిళా సంఘాలు, ముఖ్యంగా ఐద్వా నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. విశాఖ వంటి నగరాల్లో సాయంత్రం వేళ మహిళలు, పిల్లలు, కుటుంబాలు ఆహ్లాదకరంగా గడపడానికి బీచ్కు వస్తారని, అలాంటి ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం విక్రయాలు నిర్వహించడం సమాజానికి హానికరమని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే అవగాహన లోపం, నిర్లక్ష్యం కారణంగా బీచ్ ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయని గుర్తుచేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మద్యం విక్రయాలు పెరిగితే మద్యం మత్తులో సముద్రంలోకి వెళ్లే వారి సంఖ్య పెరిగి ప్రమాదాలు మరింత అధికమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా, మద్యం అందుబాటు పెరగడం వల్ల ఆకతాయిల కార్యకలాపాలు పెరిగి మహిళలు(Womens), విద్యార్థినులు వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు (Women’s Organizations) హెచ్చరిస్తున్నాయి. కుటుంబాల కోసం ఉద్దేశించిన ప్రజా ప్రదేశాలను మద్యం కేంద్రాలుగా మార్చడం సరైన విధానం కాదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో విశాఖ బీచ్లో ‘బీచ్ షాక్స్’ ప్రతిపాదన అభివృద్ధి చర్యగా మారుతుందా? లేక కొత్త సామాజిక వివాదానికి కారణమవుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.






