విజయవాడలో (Vijayawada) కాపు యువకుడు గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) అదృశ్యం, లాకప్ డెత్ (Lockup Death) ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన వేళ కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకుని హింసించి చంపేసి, అనంతరం శవాన్ని తగులబెట్టేశారనే ఆరోపణలు ఇప్పటికే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులు, బంధువులు ఆయన ఆచూకీ కోసం ఆందోళనలు కొనసాగిస్తున్న సమయంలో కేసును నీరుగార్చేందుకు కొందరు జనసేన(Jana Sena) నాయకులు సెటిల్మెంట్ (Settlement) ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.
సాయికృష్ణ మేనమామ, రాధా-రంగా మిత్ర మండలి (Radha-Ranga Mitra Mandali) సభ్యుడు ముళ్లపూడి నవరంగ్ (Mullapudi Navarang) మీడియాతో మాట్లాడుతూ, జనసేనకు చెందిన ఓ కీలక నాయకుడు తనను కలిసి కేసును రాజీ చేసుకోవాలని సూచించారని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ అధికారితో రాజీకి రావాలని రాయబారాలు నడిపినట్లు ఆయన వెల్లడించారు.
నవరంగ్ చెప్పిన వివరాల ప్రకారం, జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు (Ammishetty Vasu) తమ ఇంటికి వచ్చి “ఏదో జరిగిపోయింది, సీఐ మన కులానికి చెందిన వ్యక్తి. ఆయన మనకు ఎన్నో పనులు చేస్తున్నారు. కాంప్రమైజ్ అవుదాం, ఆయన్ని కాపాడుకుందాం” అంటూ మాట్లాడారని ఆరోపించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నవరంగ్, “నష్టపోయింది మా కుటుంబం. కులం పేరుతో ఒక యువకుడి ప్రాణం పోయినా మాట్లాడకూడదా?” అని ప్రశ్నించారు.
ఈ ఆరోపణలు బయటకు రావడంతో కేసు మరింత రాజకీయ రంగు పులుముకుంది. లాకప్ డెత్ ఆరోపణలతో పాటు, బాధిత కుటుంబంతో రాజీ ప్రయత్నాలు జరిగాయనే వాదనలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ నాయకత్వం, ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.






