వయనాడ్లో (Wayanad) మరోసారి ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది. 2024లో సంభవించిన ఘోర విపత్తును తలపించేలా మంగళవారం భారీ కొండచరియలు (Landslides) విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో 4 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో (CCTV Cameras) రికార్డవడంతో అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మంగళవారం కల్లాడి సమీపంలోని మీనాక్షి బ్రిడ్జి (Meenakshi Bridge) వద్ద నిర్మాణంలో ఉన్న అనక్కంపోయిల్–కల్లాడి–మెప్పాడి (Anakkampoyil-Kalladi-Meppadi) టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు (Tunnel Road Project) ప్రాంతంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలే (Heavy Rains) ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియోలో కార్మికులు సాధారణంగా పనులు చేస్తుండగా, క్షణాల్లోనే కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు విరిగిపడి వేగంగా దూసుకొచ్చిన దృశ్యాలు కనిపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన వారు పరుగులు తీయగా, కొందరు తృటిలో తప్పించుకున్నారు. మరికొందరు మట్టిపెళ్లల కింద చిక్కుకున్నారు.
కొండచరియల ఉద్ధృతి ఎంత తీవ్రంగా ఉందో వీడియోలో స్పష్టంగా కనిపించింది. అక్కడ నిలిపి ఉంచిన ట్యాంకర్ లారీని కూడా మట్టి ప్రవాహం అనేక మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. అలాగే ఒక దంపతులతో పాటు మరో వ్యక్తి మట్టిలో చిక్కుకున్నప్పటికీ, కొద్ది సేపటికే సురక్షితంగా బయటపడటం అందరికీ ఊరటనిచ్చింది.
ఈ ఘటనతో వయనాడ్లో పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ నిర్మాణ ప్రాజెక్టులపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా అనక్కంపోయిల్–కల్లాడి–మెప్పాడి టన్నెల్ రోడ్డు ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు గతంలో వ్యక్తం చేసిన ఆందోళనలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
ప్రమాదంలో మృతిచెందిన 4 మంది కుటుంబాలకు వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ, ముఖ్యమంత్రి సతీశన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారు, సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని, బాధితులకు అన్ని విధాల సహాయం అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.








