---Advertisement---

మమత ఆగ్రహం.. ర్యాలీలో పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మమతా బెనర్జీ!

July 9, 2026

Summarize with AI

---Advertisement---

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో నిర్వహించిన తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి, యువజన విభాగాల ర్యాలీలో చోటుచేసుకున్న ఘటనతో వార్తల్లో నిలిచారు. ర్యాలీ సందర్భంగా ఏర్పడిన గందరగోళంలో ఆమె పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీజేపీ నేతలు విస్తృతంగా షేర్ చేస్తుండగా, ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

బారుయిపూర్‌లో ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా జూలై 9న టీఎంసీ విద్యార్థి, యువజన విభాగాలు కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించాయి. కలకత్తా హైకోర్టు అనుమతితో బాలిగంజ్ ఫారి నుంచి హజ్రా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ ముగిసిన అనంతరం అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పలువురు కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం.

గాయపడిన కార్యకర్తలు, మహిళా కార్యకర్తలను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే సమయంలో వారికి దారి కల్పించేందుకు మమతా బెనర్జీ స్వయంగా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆమె చుట్టూ చేరడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వైరల్ అవుతున్న వీడియోలో మమత తనకు సమీపంలో ఉన్న వ్యక్తి వైపు చేయి ఎత్తినట్లు కనిపిస్తోంది. అనంతరం ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లగా, మమత ముందుకు సాగిపోయారు.

అయితే ఈ ఘటన అంబులెన్స్‌కు దారి కల్పించే ప్రయత్నంలో ఏర్పడిన గందరగోళంలో అనుకోకుండా జరిగి ఉండొచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైరల్ అవుతున్న వీడియో ప్రామాణికతను స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు.

మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగా కార్యకర్తను కొట్టారా లేదా తోపులాటలో అనుకోకుండా చేయి తగిలిందా అన్న అంశంపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. అలాగే ఈ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియోపై రాజకీయ చర్చ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment