పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో బుధవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని గైనకాలజీ, మాతా శిశు సంరక్షణ విభాగంలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ పేలడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. చూస్తుండగానే మంటలతో పాటు దట్టమైన పొగ వార్డు మొత్తం కమ్ముకోవడంతో అక్కడ చికిత్స పొందుతున్న పసికందులు ప్రమాదంలో చిక్కుకున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో మొత్తం 16 మంది శిశువులు ఉన్నారు. అయితే సహాయక సిబ్బంది ఒక్క శిశువును మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. మిగిలిన 15 మంది పసికందులు మంటలు, పొగ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు ఆసుపత్రికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. పుట్టిన కొద్ది రోజులకే 15 మంది పసికందులు ప్రాణాలు కోల్పోవడంతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి హృదయ విదారకంగా మారింది.
ఈ ఘటనపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి అసలు కారణాలను నిర్ధారించేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో విద్యుత్ లోపాలు, అగ్ని భద్రతా చర్యలు సహా ప్రమాదానికి దారితీసిన అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నారు.








