కెన్యాలో (Kenya) విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉతుమిషి గర్ల్స్ బోర్డింగ్ స్కూల్ (Utumishi Girls Boarding School) హాస్టల్లో (Hostel) అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించి 16 మంది విద్యార్థినులు (Students) సజీవ దహనమయ్యారు. నిద్రలో ఉన్న చిన్నారులు మంటల్లో చిక్కుకుని బయటపడలేకపోవడంతో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
విద్యాశాఖ (Education Minister) మంత్రి జూలియస్ ఒగాంబా (Julius Ogamba) తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో మరో 79 మంది విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో హాస్టల్ గదిలో సుమారు 220 మంది బాలికలు నిద్రిస్తున్నట్లు సమాచారం. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో హాస్టల్ మొత్తం భయానకంగా మారింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కెన్యా రెడ్ క్రాస్ (Kenya Red Cross) బృందాలు, పోలీసులు, అత్యవసర సహాయక సిబ్బంది (Emergency Rescue Staff) ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థినులను వెంటనే స్థానిక సెయింట్ జోసెఫ్ ఆసుపత్రికి (St. Joseph Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే వందలాది మంది తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. తమ పిల్లల పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందుతూ హాస్టల్ బయట వేచిచూశారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కెన్యా అధ్యక్షుడు (Kenyan President) విలియం రుటో (William Ruto) ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కెన్యాలోని బోర్డింగ్ పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలు సరిగా అమలు కాకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








