హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజకీయాలు చేయడం ప్రతి ఒక్కరి హక్కేనని చెప్పిన కేటీఆర్.. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, ప్రజల భావోద్వేగాలను గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణలో రాజకీయాలపై కేటీఆర్ క్లారిటీ
దేశంలో ఎవరికైనా రాజకీయ పార్టీ స్థాపించే హక్కు ఉందని, ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని కేటీఆర్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2023 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేశారని, అప్పుడు ఎవరూ అడ్డుకోలేదని గుర్తుచేశారు. గత 12 సంవత్సరాలుగా తెలంగాణలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రశ్నించారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే రాజకీయ సభ నిర్వహించాల్సిన అవసరం ఏమిటని పవన్ కళ్యాణ్ను నిలదీశారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన రోజున రాజకీయ విమర్శలు చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.
ప్రాంతీయవాదం వ్యాఖ్యలపై ఘాటు కౌంటర్
ప్రాంతీయవాదంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మద్రాస్ రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ దీక్ష కూడా ప్రాంతీయవాదమేనా? అని ప్రశ్నించారు.తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్షలు, స్వాభిమానానికి ప్రతీకగా సాగిన చారిత్రాత్మక పోరాటమని చెప్పారు. వేలాది మంది యువత త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. అలాంటి ఉద్యమాన్ని తప్పుగా చిత్రీకరించడం సరికాదన్నారు.
మోడీ ప్రభుత్వంపై కూడా విమర్శలు
దేశభక్తి విషయంలో మాకు ఎవరి దగ్గరా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు గుజరాత్కు తరలిపోయాయని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల హక్కుల కోసం కూడా బీఆర్ఎస్ పోరాడిందని పేర్కొన్నారు.
“పవన్కు గౌరవం ఉంది.. కానీ తెలంగాణను తక్కువ చేస్తే ఊరుకోం”
పవన్ కళ్యాణ్ను ఉప ముఖ్యమంత్రిగా గౌరవిస్తామని, నటుడిగా అభిమానిస్తామని కేటీఆర్ తెలిపారు. పవన్ ఇంటికి వస్తే బిర్యానీ పెట్టి మర్యాద చేస్తామని, కానీ తెలంగాణ సచివాలయంలో కూర్చొని రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
“తెలంగాణకు అసలైన ఓజీ కేసీఆర్”
పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు అసలైన ఓజీ కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ కోసం దశాబ్దాల పాటు పోరాడి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం సులభంగా రాలేదని, వేలాది మంది త్యాగాలు, అనేక సంవత్సరాల ఉద్యమ ఫలితంగా ఏర్పడిందని గుర్తుచేశారు. తెలంగాణకు ఒక్క ఓజీ చాలు.. ఇంకొకరు అవసరం లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఆత్మగౌరవంపై కేటీఆర్ స్పష్టమైన హెచ్చరిక
పవన్ కళ్యాణ్ అయినా, మరెవరైనా దేశంలో ఎక్కడైనా రాజకీయాలు చేయవచ్చని కేటీఆర్ అన్నారు. కానీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని, ఈ రాష్ట్రం కోసం జరిగిన పోరాటాన్ని ఎవరూ తక్కువ చేసి చూడలేరని కేటీఆర్ ఫైర్ అయ్యారు.







