ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడేవన్నీ సొల్లు కబుర్లేనంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, తెలంగాణలో తన సభకు అనుమతి ఇవ్వలేదని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
జగన్ ప్రభుత్వంలో మీటింగ్లకు పర్మిషన్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు తెలంగాణలో అదే పరిస్థితి ఎదురైనా ఎందుకు మౌనం వహిస్తున్నారని పేర్ని నాని ప్రశ్నించారు. యూట్యూబర్లు, రిపోర్టర్ల కోసం మాత్రమే పవన్ ప్రెస్మీట్ పెట్టారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తాను వైఎస్సార్ను ఎదిరించానని పవన్ కళ్యాణ్ చెప్పుకోవడం హాస్యాస్పదమని పేర్ని నాని అన్నారు. పవన్ చెప్పేవన్నీ కల్పిత కథల్లా ఉంటాయని మండిపడ్డారు. ఏపీలో సొంతంగా మీటింగ్ పెట్టుకోలేని పవన్, తెలంగాణలో సభలు పెడతానని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. సూపర్ సిక్స్ హామీలపై ప్రశ్నిస్తానని చెప్పడం కూడా రాజకీయ డ్రామానేనని విమర్శించారు.
“తల్లికి కూడుపెట్టలేనోడు పినతల్లికి పట్టుచీర పెడతాడట” అంటూ పవన్పై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
తెలంగాణలో ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు, మంత్రులు పవన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పవన్ కామెంట్స్ను తప్పుబట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ చర్చలు మరింత ఉత్కంఠగా మారాయి.






