తిరుపతిలోని పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు చివరకు రక్తపాతానికి దారితీయగా, పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలోనే 2 మంది వ్యక్తులు కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతిలో ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులు మునిరత్నం (50), మణికంఠ (42)గా గుర్తించారు. తిరుమలలో పనిచేస్తున్న సంపూర్ణమ్మ కుమార్తెను ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్ వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే భార్యను సునీల్ విడిచిపెట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపంలో జరుగుతున్న మరో వివాహానికి సునీల్ వస్తున్నాడని తెలుసుకున్న సంపూర్ణమ్మ ఈ విషయాన్ని తమ కుమార్తె వివాహానికి పెద్దలుగా వ్యవహరించిన మునిరత్నం, మణికంఠలకు తెలియజేశారు.
సమాచారం అందుకున్న మునిరత్నం, మణికంఠ వెంటనే కల్యాణ మండపానికి చేరుకుని భార్యను ఎందుకు వదిలేశావని సునీల్ను ప్రశ్నించారు. ఈ విషయంపై ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం కాస్త ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి వచ్చిన సునీల్ తమ్ముడు, అక్క, మరో బంధువు కలిసి మునిరత్నం, మణికంఠలపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం ఘటనాస్థలంలోనే మృతి చెందగా, రక్తపు మడుగులో పడిపోయిన మణికంఠను వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఘటనలో 2 మంది మృతి చెందడంతో పెళ్లికి హాజరైన అతిథులు భయాందోళనలకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సునీల్తో పాటు అతడి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశముంది.






