తెలంగాణ (Telangana) మహిళా కమిషన్ (Women Commission) చైర్పర్సన్(Chairperson), మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) కుటుంబంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆమె సోదరి (Sister) కె. నమ్రత (K. Namrata) (57) అదృశ్యమైన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాన్ పరిసర ప్రాంతంలో నివసిస్తున్న కె. నమ్రత ఈ నెల 4వ తేదీ ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే గంటలు గడిచినా, రోజులు గడుస్తున్నా ఆమె నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దీంతో గద్వాల విజయలక్ష్మి స్వయంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ను (Banjara Hills Police Station) ఆశ్రయించి అధికారికంగా ఫిర్యాదు చేశారు. తన సోదరి అదృశ్యం వెనుక సతీష్ (Satish) (35), సత్యనారాయణ (Satyanarayana) (45), కుమారి (Kumari) (45) అనే ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ముగ్గురిపై తనకు బలమైన అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
విజయలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనుమానితుల వివరాలను సేకరిస్తూనే, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నమ్రత ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను వేగవంతం చేసినట్లు సమాచారం అందుతోంది.






