రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (Gade Saikrishna) మిస్సింగ్ కేసులో(Missing Case) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)(SIT)ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవి ప్రకాష్ను (IG Ravi Prakash) నియమించగా, సభ్యులుగా పశ్చిమగోదావరి ఎస్పీ అద్నాన్ నయీం షమీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అదనపు ఎస్పీ ఎల్. సుధాకర్లను నియమించింది.
విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మే 9న అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆయనను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుని హింసించి హత్య(Murder) చేశారంటూ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు విజయవాడ కృష్ణలంకలోని స్వర్గపురి (Swargapuri) శ్మశానవాటికపై దృష్టి సారించడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
దర్యాప్తు బృందం శ్మశానవాటికలో పనిచేస్తున్న బాషా(Basha) అనే ఆపరేటర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. సాయికృష్ణకు సంబంధించిన ఆధారాలు అక్కడ ఉండవచ్చన్న అనుమానాల నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా శ్మశానవాటికలో అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వెలుగులోకి రావడం కేసును మరింత కీలక దశకు తీసుకెళ్లింది.
నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించరాదు. అయితే మే 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను స్వర్గపురికి తీసుకువచ్చినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఆ సమయంలో దహనానికి అనుమతి లేకపోవడంతో మృతదేహాలను అక్కడే ఉంచి, మరుసటి రోజు ఉదయం దహనం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన రికార్డులు, అనుమతులు, విధివిధానాలు సక్రమంగా పాటించారా లేదా అనే అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా అనాధ మృతదేహాల దహనం లేదా ఖననం కోసం అవసరమైన అనుమతులు ఎవరు ఇచ్చారు? రికార్డులు పూర్తిగా నిర్వహించబడ్డాయా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
సాయికృష్ణ (Saikrishna) కేసు దర్యాప్తు పలు అనూహ్య మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.






