ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు. జూలై 11న నిర్వహించనున్న జేఎన్టీయూ-జీవీ తొలి స్నాతకోత్సవాన్ని విశాఖపట్నంలో కాకుండా విజయనగరంలో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్నాతకోత్సవానికి ఆహ్వానం పంపినందుకు గవర్నర్కు కృతజ్ఞతలు తెలియజేసిన బొత్స, విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన అసలు ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని విజయనగరంలోనే నిర్వహించడం సముచితమని పేర్కొన్నారు.
వెనుకబడిన విజయనగరం జిల్లా అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని జేఎన్టీయూ-జీవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని బొత్స గుర్తు చేశారు. విశ్వవిద్యాలయం స్థాపనకు 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా తొలి స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్న వేళ, అదే జిల్లాలో ఈ కార్యక్రమం జరగడం విద్యార్థులు, ప్రజలకు గౌరవప్రదంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మరో 2 నెలల్లో విజయనగరం క్యాంపస్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో విశాఖపట్నంలో స్నాతకోత్సవాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం విజయనగరం జిల్లా ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించిందని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తొలి స్నాతకోత్సవాన్ని విజయనగరంలోనే నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను బొత్స సత్యనారాయణ తన లేఖ ద్వారా కోరారు. ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







