విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన సాయికృష్ణ లాక్అప్ డెత్ కేసు విచారణపై ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ, మృతుడి పిన్ని అడ్వకేట్ కనకదుర్గ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
సాయికృష్ణ లాక్అప్ డెత్ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. సీబీఐ విచారణ వద్దు, జ్యుడీషియల్ ఎంక్వైరీ వద్దు అని చెబుతున్నారు. సిట్ ఏం చేస్తుందో మేమూ అదే చేస్తాం.. ప్రభుత్వం చెప్పిందే వినాలని ఒత్తిడి తెస్తున్నారు. మేము సామాన్యులం.. ఏం చెప్పమంటే అదే చెప్పిస్తున్నారు అని కనకదుర్గ వ్యాఖ్యానించారు.
కేసులో విజయలక్ష్మి తప్పుకున్నా తాను మాత్రం పోరాటం కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు. విజయలక్ష్మిపై ఒత్తిళ్లు ఉండటంతోనే మానవ హక్కుల కమిటీ తరఫున విచారణ కోరవద్దని కోర్టులో చెప్పారని ఆమె ఆరోపించారు.
నాకు కూడా చెప్పకుండా విజయలక్ష్మి కోర్టుకు వచ్చారు. ఒత్తిళ్ల కారణంగానే న్యాయవాదులను మార్చుకున్నారు. సాయికృష్ణ తల్లిని కోర్టుకు తీసుకురావడంలో కూడా హైడ్రామా నడిచింది. ఆ హైడ్రామా వెనుక ఎవరు ఉన్నారో మాకు తెలియదు అని కనకదుర్గ అన్నారు.
తన అక్క విజయలక్ష్మి పోరాటం కొనసాగించకపోయినా, తాను సాయికృష్ణకు పిన్నిగా మానవ హక్కుల కమిటీ తరఫున న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని కనకదుర్గ వెల్లడించారు.






