నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై (NEET Paper Leakage) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థి సంఘాల (Student Organizations) ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. అనంతపురంలో (Anantapur) ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వగా, నగరంలోని కేఎస్ఆర్ కళాశాల (KSR College) వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
బంద్ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఎస్ఎఫ్ఐ (SFI) నాయకులు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించగా, వారిని పోలీసులు(Police) ఈడ్చి పారేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదే సమయంలో విశాఖపట్నంలోని (Visakhapatnam) కృష్ణా కాలేజీ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ను (Mega Parent Teacher Meeting) విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. నీట్ పేపర్ లీకేజీపై నిరసన వ్యక్తం చేస్తూ పేరెంట్–టీచర్ మీటింగ్ను వెంటనే రద్దు చేయాలని, అలాగే కేంద్ర విద్యా మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీకేజీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నాయి.







