తెలంగాణ జాగృతి (Telangana Jagruti) రాష్ట్ర అధ్యక్షురాలిగా (State President) మారిపల్లి మాధవిని (Maripalli Madhavi) నియమిస్తూ సంస్థ ఫౌండర్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అధికారికంగా ప్రకటించారు. సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కవిత.. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. సంస్థ భవిష్యత్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను కొత్త అధ్యక్షురాలికి అప్పగించినట్లు తెలిపారు.
గత 20 సంవత్సరాలుగా తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం, ఆత్మగౌరవ పరిరక్షణ లక్ష్యంగా తెలంగాణ జాగృతి నిరంతరం పనిచేస్తోందని కవిత పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2006లో ఈ సంస్థను స్థాపించి.. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు.
తెలంగాణ పల్లెలకే పరిమితమైన బతుకమ్మ పండుగను (Bathukamma Festival) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేయడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించిందని కవిత తెలిపారు. బతుకమ్మ వేడుకలను ఉద్యమ వేదికగా మార్చి వేలాది మంది మహిళలను తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భాగస్వాములను చేయడంలో సంస్థ విశేష కృషి చేసిందని వెల్లడించారు.
ఇప్పటి వరకు రెండు దశాబ్దాల పాటు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) … ఇకపై ఫౌండర్ చైర్పర్సన్గా కొనసాగనున్నారు. కొత్త అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన మారిపల్లి మాధవి నాయకత్వంలో తెలంగాణ జాగృతి మరింత బలంగా ముందుకు సాగి.. సంస్థ లక్ష్యాలను విజయవంతంగా సాధిస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.






