విశాఖలోని సింహాచలం (Simhachalam) అప్పన్న గిరి ప్రదక్షిణ (Appanna Giri Pradakshina) నేడు ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు (Devotees) సింహాద్రికి తరలివచ్చారు. అప్పన్న తొలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని ప్రార్థించిన అనంతరం గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తున్నారు. మొత్తం 32 కిలోమీటర్ల మేర కొండ చుట్టూ పాదయాత్ర (Foot Pilgrimage) చేసి రేపు ఉదయం ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్నారు.
ఈ ఏడాది గిరి ప్రదక్షిణలో 10 లక్షలకుపైగా భక్తులు పాల్గొంటారని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా సింహాచలం దేవస్థానం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. నేడు, రేపు అప్పన్న స్వామి ఉచిత దర్శనం (Free Darshan) కల్పించడంతో పాటు ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఉచిత బస్సు (Free Bus) సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీరు, వైద్య సేవలు, భద్రత, విశ్రాంతి కేంద్రాలు వంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి భక్తులకు సురక్షితమైన యాత్ర కల్పిస్తోంది.
ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైన యాత్రగా భావిస్తారు. 32 కిలోమీటర్ల ఈ పాదయాత్రను భక్తిశ్రద్ధలతో పూర్తి చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని, పాపాలు తొలగి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.







