ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కార్యాలయాల (Office) కోసం ప్రభుత్వ భూముల కేటాయింపులు (Government Lands Allocations) వరుసగా కొనసాగుతున్నాయి. పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ కార్యాలయాల(TDP Offices) కోసం మాత్రం విలువైన ప్రభుత్వ భూములను దీర్ఘకాలిక లీజుల పేరుతో (Long-Term Leases) కేటాయిస్తోందని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం (Kalyandurgam) నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం అర ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని ఏడాదికి కేవలం రూ.1,000 లీజు చెల్లింపుతో 66 సంవత్సరాల పాటు ఇవ్వగా, పార్టీ కొనసాగితే 99 సంవత్సరాల వరకు లీజు పొడిగించే అవకాశం కూడా కల్పించారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (Urban Development Authority) నుంచి ఎన్ఓసీ (NOC) వచ్చిన అనంతరం భూమిని అప్పగించనున్నారు.
ఇదే తరహాలో ఇటీవల ప్రకాశం జిల్లా కొండపి, గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri), అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూడా టీడీపీ కార్యాలయాల కోసం అర ఎకరం చొప్పున ప్రభుత్వ భూములను కేటాయించారు. మంగళగిరి మండలం నవులూరులోని సర్వే నంబర్ 791/4లో ఉన్న అర ఎకరం భూమిని, అలాగే రాయదుర్గం మండలం సర్వే నంబర్ 280లోని అర ఎకరం భూమిని టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఈ కేటాయింపులు కూడా ఏడాదికి రూ.1,000 లీజుతో 66 సంవత్సరాల పాటు ఉండగా, అవసరమైతే 99 సంవత్సరాల వరకు పొడిగించే వెసులుబాటు కల్పించారు.
అనకాపల్లి జిల్లాలో (Anakapalli District) టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఎకరాకు ఏడాదికి రూ.1,000 అద్దెతో 33 సంవత్సరాల లీజు మంజూరు చేశారు. ఈ భూమిని కేటాయించాలంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు చేసిన దరఖాస్తు ఆధారంగా కలెక్టర్ అనుమతి ఇచ్చారు.
ఈ కేటాయింపులపై ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలోనే అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, అధికార పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములను కేటాయించడం ప్రజా ప్రయోజనాలకు ఎలా ఉపయోగపడుతుందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధంగా 20కిపైగా ప్రభుత్వ భూముల కేటాయింపులు టీడీపీ కార్యాలయాల పేరుతో జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విలువైన ప్రభుత్వ భూములను దీర్ఘకాలిక లీజుల పేరుతో పార్టీ కార్యాలయాలకు కేటాయించడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.







