ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని (Uday Krishna Reddy) మహిళా ట్రైనీ ఐపీఎస్ (Woman Trainee IPS) అధికారి ఇచ్చిన లైంగిక వేధింపులు (Sexual Harassment), దాడి కేసులో పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. మంగళవారం సాయంత్రం తన స్వగ్రామం నుంచి హైదరాబాద్కు వస్తుండగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda) సమీపంలోని దామరచర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు (Attapur Police Station) తరలించి విచారణ నిర్వహించారు. మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
ఈ నెల 18న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన 2 రోజుల తర్వాత అంటే ఈ నెల 20న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 4 రోజుల పాటు చికిత్స పొందారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
తర్వాత తన స్వగ్రామంలో కనిపించిన ఉదయ్ కృష్ణారెడ్డి తాను ఎక్కడికీ పారిపోలేదని, తన నాయనమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో గ్రామానికి వచ్చానని మీడియాకు తెలిపారు. విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని, న్యాయవ్యవస్థపై (Judiciary) పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. అయితే హైదరాబాద్కు తిరిగి వస్తున్న సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దర్యాప్తులో భాగంగా అధికారులు అర్ధరాత్రి వరకు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
మరోవైపు ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆమె మెడపై గాయాల మచ్చలు, చెంపపై గాయాల ఆనవాళ్లు, ఎడమ కాలిపై కూడా గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులు సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయగా, కోర్టు విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.






